EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: డీజీపీ సీవీ ఆనంద్

    Author THADEM PRASHANTH | 07 Sep 2026, 07:36 PM | TELANGANA
    ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: డీజీపీ సీవీ ఆనంద్

    మండపాల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, నిమజ్జన రూట్లపై ముందస్తు ప్రణాళిక తప్పనిసరి

    అన్ని జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌
    రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్‌ 7, హిందుస్థాన్‌ మీడియా:
    ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
    గణేష్‌ మండపాలు, విగ్రహాల ఏర్పాటు ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, తేదీలు, సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే సేకరించాలని సూచించారు. గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, సున్నితమైన, వివాదాస్పద ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

    మండపాల వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసి సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    నిమజ్జన మార్గాలపై ప్రత్యేక దృష్టి
    గణేష్‌ నిమజ్జన ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి రోడ్లపై గుంతలు, విద్యుత్‌ తీగలు, కేబుల్‌ వైర్లు, చెట్లు, కొమ్మలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల వంటి సమస్యలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని డీజీపీ సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, లైటింగ్‌, సీసీ కెమెరాలు, స్విమ్మర్లు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.
    డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు, రెచ్చగొట్టే పోస్టులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఉత్సవ నిర్వాహకులు, పీస్‌ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి పోలీసులకు సహకరించేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
    వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్‌, ఆర్‌ఐలు మధుకర్‌, సురేష్‌, రమేష్‌, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

    ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: డీజీపీ సీవీ ఆనంద్  - Additional Image