కొమురవెళ్లి ఆలయ ధర్మకర్తల మండలికి 100కు పైగా దరఖాస్తులు

పోలీస్‌ విచారణ అనంతరం 14 మంది సభ్యులతో కొత్త బోర్డు కొమురవెల్లి, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి వందకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. గత నెల 11న ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఆలయంలో 81 మంది దరఖాస్తు చేసుకున్నారని, దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మరికొందరు దరఖాస్తులు సమర్పించినట్లు ఈవో తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను పోలీస్‌ విచారణకు పంపామని, పోలీసుల నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలో 14 మంది సభ్యులతో నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.