🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Aug, 2026 | Page: 1

వీధి కుక్కలతో జంకుతున్న ప్రజలు

రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడద.. పట్టించుకోని సంబంధిత అధికారులు
పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ఆందోళన
కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మద్దూరు మండల ప్రజల డిమాండ్
సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, ఆగస్టు 24: మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన వీధులు, కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను తల్లిదండ్రులు ఒంటరిగా పంపేందుకు భయపడుతున్నారు. కుక్కలు ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ మరింత భయం
రాత్రి వేళల్లో వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ కుక్కలు అరుపులతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు వాపోతున్నారు.
సర్పంచ్‌లు, అధికారులు స్పందించాలి
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మద్దూరు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు వీధి కుక్కల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి, చిన్నారులు, మహిళలు, వృద్ధులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కుక్కల బెడద మరింత పెరిగి ప్రజలకు ప్రమాదం కలగకముందే సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
🏠 Home