🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Aug, 2026 | Page: 1

ఒక చేయూత.. ఓ జీవితానికి కొత్త బాట..

పెద్ద మనసు చాటుకున్న వరగంటి శ్రీకాంత్, సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి
జీవనోపాధికి పాన్ డబ్బా ఏర్పాటు.. దాతల మానవతా దృక్పథం
హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 23: అమ్మానాన్న లేరు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం.. కాళ్లకు చలనం లేదు.. అయినా ఆత్మవిశ్వాసంతో మూడు చక్రాల బండిపై చిరుతిళ్లు, కురుకురేలు, మసాలాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న దివ్యాంగుడు తమ్మడి రాజుకు పలువురు దాతలు అండగా నిలిచారు. ఆయన దీనస్థితిపై వెలువడిన వార్తా కథనానికి స్పందించిన చేర్యాలకు చెందిన వరగంటి శ్రీకాంత్ తన సొంత ఖర్చులతో పాన్ డబ్బాను తయారు చేయించి బుధవారం దూల్మిట్ట గ్రామంలో ప్రారంభించారు. దీంతో రాజుకు స్థిరమైన జీవనోపాధికి ఒక మార్గం ఏర్పడింది.అదేవిధంగా లింగాపూర్ గ్రామానికి చెందిన రమేష్, మేకల విజయ్ కలిసి రూ.5 వేల విలువైన పాన్ మసాలా సామగ్రిని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దుకాణం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న దూల్మిట్ట గ్రామ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుడు పరిస్థితిని తెలుసుకుని మరింత కిరాణా సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు తనవంతుగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.
అలాగే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) చేర్యాల డివిజన్ కమిటీ నాయకులు దుకాణానికి ఒక ఫ్యాన్‌ను అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుడు తమ్మడి రాజుకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.
తనకు అండగా నిలిచి జీవనోపాధికి సహాయం చేసిన దాతలందరికీ తమ్మడి రాజు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం తన జీవితంలో కొత్త ఆశను నింపిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు తుమ్మలపల్లి అనిల్, ఉపాధ్యక్షుడు తాండ్ర సత్తయ్య, సహాయ కార్యదర్శి పర్వతం మల్లయ్య, సంఘం సభ్యులు కర్రె రవి, తుమ్మలపల్లి అనిల్ కుమార్తో పాటు దూల్మిట్ట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home