🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 14 Aug, 2026 | Page: 1

రైతులకు ప్యాక్స్‌లు వెన్నుదన్నుగా నిలవాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి


రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించాలి
హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) రైతులకు అండగా నిలిచి, వారి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం ఇల్లంతకుంట ప్యాక్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.చైర్మన్‌గా ఊట్కూరి వెంకట రమణారెడ్డి, వైస్ చైర్మన్‌గా యాస తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా సొల్లు కవిత, ఉప్పుల సంజీవరెడ్డి, సింగిరెడ్డి లక్ష్మి, కేతిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, కోనేటి నర్సయ్య, ముక్కిస ఎల్లారెడ్డి, గుండ వెంకటేశం, ఎలుక అనిల్‌కుమార్, ఏలేటి మాధవరెడ్డి, జాప బాల్‌రెడ్డి, ఒగ్గు రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందేలా చూడటం నూతన పాలకవర్గం ప్రధాన బాధ్యత అని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.
ప్యాక్స్‌లు పారదర్శకంగా పనిచేస్తూ ఆదర్శ సహకార సంఘాలుగా ఎదగాలని సూచించారు. అవినీతికి తావులేకుండా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాలు రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
నూతన పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్యాక్స్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చైర్మన్
ప్యాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తానని స్పష్టం చేశారు.చైర్మన్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వానికి వెంకట రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home