🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 13 Aug, 2026 | Page: 1

నర్సాయపల్లి జిపి లో సమీక్ష సమావేశం

అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటిపై సమీక్ష
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి అంశాలపై సాధారణ సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై పాలకవర్గ సభ్యులతో చర్చించారు.
సమావేశంలో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సమస్యలతో పాటు వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పాయింట్లు, వర్షపు నీటి సంరక్షణ గుంతల ఏర్పాటుపై సమీక్షించారు.అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఇంకుడు గుంతలు, పిట్టలగూడెం, బస్టాండ్ సమీపంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ మంతెన భరత్‌రెడ్డి, వార్డు సభ్యులు గట్టు సంతోష్, రాగుల బాలనర్సయ్య, దోప్ప కిషన్, చల్ల సంతోష్‌రెడ్డి, తుమ్మల శ్రీను, పంచాయతీ కార్యదర్శి పి. భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home