🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 13 Aug, 2026 | Page: 1

అయినాపూర్‌లో సీపీఎం ధర్నా

గ్రామ సమస్యలు పరిష్కరించాలి.. పంచాయతీ అధికారికి వినతి
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పంచాయతీ అధికారి రాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తేలు ఇస్తారీ మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
వాటర్ ప్లాంట్ ప్రారంభించాలి: గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించి ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలి.
వీధి దీపాలు ఏర్పాటు చేయాలి: గ్రామంలోని అన్ని వీధులతో పాటు ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దోమల బెడద నివారించాలి: గ్రామంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రివేళల్లో క్రమం తప్పకుండా దోమల నివారణ మందు పిచికారీ చేయాలని కోరారు.
పాఠశాలల్లో పరిశుభ్రత: గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను గ్రామపంచాయతీ తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ఉల్లంపల్లి సాయిలు, సున్నం యాదగిరి, కానుగుల రాజు, ఏనుగుల శీను, పబ్బోజు నవీన్, పాశం చంద్రయ్య, మల్ల అంజయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home