🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Aug, 2026 | Page: 1

ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం :చేర్యాల సీఐ రమేష్ నాయక్

సలాకపూర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 12: సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాకపూర్ గ్రామంలో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్, ఉపసర్పంచ్ శెట్టే ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాలను చేర్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు సంతోషకరమైన విషయమన్నారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచ్, ఉపసర్పంచ్, దాతలు, గ్రామ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున సీఐ రమేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూరు ఎస్‌ఐ ఆసిఫ్, గ్రామ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home