🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Aug, 2026 | Page: 1

సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి

కనువిప్పు కళా ప్రదర్శనలో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం, మూఢనమ్మకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్ సూచించారు.జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ, పోలీస్ కనువిప్పు బృందం, తెలంగాణ సాంస్కృతిక సారధి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి చేర్యాల మండలం కాశేగుడిసెలు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళా ప్రదర్శనలు, పాటలు, నాటికల ద్వారా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
సైబర్ మోసానికి గురైతే 1903 కి ఫోన్ చేయండి : చేర్యాల సీఐ రమేష్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రజల అప్రమత్తత లోపం వల్లే అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారులు, పోలీసులు అంటూ అపరిచితులు ఫోన్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలి

యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్‌కు అలవాటుపడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ కోరారు. చిన్నచిన్న సమస్యలకు కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. వాహనాలను జాగ్రత్తగా నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల కారణంగా భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

మూఢనమ్మకాలను వీడాలి: ఎస్‌ఐ అపూర్వ రెడ్డి

చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే బాధ్యత, క్రమశిక్షణ నేర్పాలని సూచించారు. ప్రజలు మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా అత్యవసర సమస్య ఎదురైతే 112కు ఫోన్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కనువిప్పు బృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, అశోక్, తెలంగాణ సాంస్కృతిక సారధి టీమ్ లీడర్ శ్యామ్, కవి గాయకులు పిన్నింటి రత్నం, సనువాల కనకయ్య, డాక్టరేట్ పన్నీరు శ్రీనివాస్, గెంటే హరిప్రసాద్, ఎల్ల సిద్దులు, బండారు నర్సింలు, చెదిరి పద్మ, సల్ల మమత తదితర కళాకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home