మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర
భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన మహిళలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
హిందుస్థాన్ మీడియా, సిద్ధిపేట రూరల్: సిద్ధిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఇంటింటి నుంచి బోనాలను ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తూ కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
బోనాల జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సంఘ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.