🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 30 Jul, 2026 | Page: 1

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇల్లంతకుంట ఎస్ ఐ అశోక్

వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.
అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన
హిందుస్థాన్ మీడియా, ( రాజన్న సిరిసిల్ల జిల్లా) ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా యువత సెల్ఫీలు దిగేందుకు, ఈత కొట్టేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల కారణంగా రహదారులపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర సహాయం కోసం డయల్-100, డయల్-112 లేదా సమీప గ్రామ పోలీసు అధికారులను వెంటనే సంప్రదించాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home