🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Jul, 2026 | Page: 1

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాలి: శ్రేణులకు కొమ్మూరి సూచన

కొమురవెల్లిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాలి.. కాంగ్రెస్ శ్రేణులకు సూచనలు
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమాన్ని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించి బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా కాంగ్రెస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తూ కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, మండల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఆకస్మిక తనిఖీలో కార్యక్రమం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
(మేర్గు కిరణ్ - రిపోర్టర్ )
🏠 Home