ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
విషం తాగి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
ఇటీవల నమోదైన వేధింపుల కేసు నేపథ్యంలో ఘటన
హైదరాబాద్, హిందుస్థాన్ మీడియా: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం విషం తాగిన ఆయనను వెంటనే నగరంలోని ఎస్సార్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆదివారం మోతీనగర్లోని తన బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి, మరుసటి రోజు ఉదయం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై వేధింపుల కేసు నమోదైంది. తనను ఓ గదిలో బంధించి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్టు చేసినట్లు సమాచారం.